అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసేవాడు. కానీ ఆ
రాజ్యంలో ప్రజలు ఎక్కువమంది సోమరులుగా తయారయ్యారు. కనీసం వారి పనిని కూడా
వారుచేసుకొనే వారు కాదు. చిన్న చిన్న పనులను కూడా రాజుగారి భటులే చేయలనుకోనేవారు.
ఎవరికి వారు మనకెందుకులే! అనుకొనేవారు. వాళ్ళకు గుణపాఠం నేర్పాలని రాజు ఆ నగరంలో
నాలుగు రోడ్ల కూడలిలో ఒక పెద్ద రాయిని రాత్రికి రాత్రి పెట్టించాడు.
మర్నాడు ఉదయం ఒక
వ్యాపారి తన మిత్రుడితో కలిసి బండి మీద వెళుతున్నాడు. ఆ నాల్గు రోడ్ల కూడలిలో రాయి
ఉండటం చేత బండి అతి కష్టం మీద రాతిని ఆనుకొని మలుపు తిరిగింది. "బండివాడి చేత
ఆ రాయిని పక్కకు నెట్టించక పోయావా?" అన్నాడు మిత్రుడు. "నాకేం పని
అది ప్రభుత్వం వారు చూసుకోవాలి" అని సమాధానం చెప్పాడు వ్యాపారి.
ఇంతలో ఒక
గుఱ్ఱపు రౌతు ఆ రాయిని దాటుతుండగా గుఱ్ఱం కాలుకు దెబ్బ తగిలింది. రౌతు రాజుగారిని
తిడుతూ గుఱ్ఱాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు.
కొంతసేపటికి ఒక రైతు భుజం
మీద నాగలితో అక్కడికి వచాడు. దారికి అడ్డంగా ఉన్న రాయిని చూసి నాగలి దించి దాన్ని
పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది జరగలేదు. సాయంగా ఆ వెళ్తున్న మరొక
వ్యక్తిని పిలిచాడు. అతడు"నేను గురువును. కూలి పనివానిని కాదు. అయినా నేను
బుద్ధిబలం చూపిస్తాగానీ భుజబలం చూపించను" అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎవరిని
పిలిచినా ఇంతేనని ఎలాగైనా ఆ రాతిని పక్కకు దోర్లించాలని నడుం బిగించి పూర్తి
నమ్మకంతో అతి కష్టం మీద రాయిని ఓ మూలకు దొర్లించాడు.
ఆ రాయి కింద డబ్బు సంచి దొరికింది.
ఆశ్చర్యంతో మూట విప్పి చూశాడు రైతు. అందులో "రాయిని తొలగించిన వారికి
రాజుగారి బహుమతి" అని ఉత్తరం కూడా ఉంది. రైతు ఎంతో ఆనందించాడు. ఈ వార్త ఆ
నోటా ఈ నోటా దేశం అంతా వ్యాపించింది. రాజ్యంలోని ప్రతి వ్యక్తి తన వంతుగా సహాయ
సహకారాలు అందజేయటం మొదలు పెట్టారు. కొంతకాలం గడిచేసరికి ఎవరిపని వాళ్ళు
చేసుకోవటంలో తృప్తి ఏమిటో వాళ్ళకు తెలిసింది.