మన భూమి పడమర నుంచి తూర్పునకు ఆత్మ భ్రమణం చేస్తూ ఉంది. దీని ఆత్మభ్రమణ దిశ శుక్రగ్రహంలా తూర్పు నుంచి పడమరకు మారితే ఏం జరుగుతుంది?
✳మనం నివసిస్తున్న భూమి పడమర నుంచి తూర్పునకు ఆత్మ భ్రమణం చేస్తూ ఉండటం వల్ల మనకు సూర్యోదయం తూర్పున, సూర్యాస్తమయం పశ్చిమాన జరుగుతోంది. భూమి తన ఆత్మభ్రమణ దిశ తూర్పు నుంచి పడమరకు మారితే అప్పుడు పశ్చిమాన సూర్యుడు ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. సౌర కుటుంబంలోని గ్రహాల్లో శుక్రుడు, యురేనస్లు మినహాయించి మన భూమి ఆత్మభ్రమణం చెందే రీతిలోనే ఆత్మభ్రమణం చేస్తున్నాయి. శుక్రగ్రహం, మన భూమికి పక్కన ఉంది. భూమి పోలికలు ఈ గ్రహానికి ఎక్కువ. శుక్రగ్రహం ఉపరితలం కాఫీ పొడి రంగులో ఉంటుంది. దీని వాతావరణంలో 95 శాతం కార్బన్ డై ఆక్సైడ్, 2 శాతం నైట్రోజన్ మిగిలిన శాతం సల్ఫ్యూరిక్ హైడ్రోక్లోరికామ్లాలు ఇంకా హీలియం, నియాన్, ఆర్గాన్లు ఉన్నాయి. ఈ గ్రహంపై కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ పెట్రోల్ సముద్రాలు ఉన్నాయేమోనని అనుమానం వస్తుంది. శుక్రగ్రహంపై అధిక ఉష్ణోగ్రత ఉంది. ఈ అధిక ఉష్ణోగ్రత, దట్టమైన వాతావరణం లేకుండా ఉన్నట్లయితే అచ్చం అది మన భూమి మాదిరి ఉండేది. ఈ శుక్రగ్రహం దాదాపు భూగ్రహం అంత పరిమాణం ఉన్నా దాని ఆత్మభ్రమణ దిశ మన భూమి ఆత్మభ్రమణ దిశకు వ్యతిరేకంగా ఉంది. అలా ఎందుకు వెనక్కి తిరుగుతోందో మాత్రం ఎవరికీ తెలియదు. శుక్రగ్రహం ఇలా ఆత్మభ్రమణం చేయడం వల్లనే అక్కడ సూర్యుడు పశ్చిమాన ఉదయించి తూర్పున అస్తమిస్తున్నాడు.