అలగ్జాండర్ జైత్ర యాత్ర సందర్భంగా భారత దేశంలో
ప్రవేశించిన తరుణంలో సరిహద్దు ప్రాంతంలో ఒక
సాధువు ధ్యానం చేసుకుంటూ కనిపించాడు.
సైనికులతో కూడిన రాజుని చూసినా ఆ సాధువు
చలించలేదు. అలగ్జాండర్ మొదట్లో కోపం
తెచ్చుకున్నప్పటికీ భారతదేశపు సాధువుల
గురించి తన గురువు గారు ఇచ్చిన సూచనలు
జ్ఞప్తికి వచ్చి ఆ సాధువు దగ్గరిగా వచ్చి అతడిని
పరిశీలనా గా చూశాడు.
ఆనంద పారవశ్యం తో
నిండిన తేజోవంతమైన సాధువు ముఖ వర్చస్సు
చూసి ఆశ్చర్యంతో సాధువుని అడిగాడట.
నేను విశ్వవిజేత అలగ్జాండర్ ని. ప్రపంచాన్ని
అంతటినీ జయించినప్పటికీ, ప్రపంచంలోని
ఐశ్వర్యం అంతా తన వద్ద ఉన్నప్పటికీ నేను
అంత ఆనందంగా ఉండలేక పోతున్నాను.
ఏమీ లేని
ఒక గోచీ పెట్టుకుని ఎండలో మాడుతూ అంత
ఆనందంగా ఉన్నావు ఎట్లాగ? అప్పుడు ఆ
సాధువు ఎదురుగా ఉన్న ఒక బండ రాయి ముక్కని
తెప్పించి రాజుని చేతులు చాచమని ఆ చేతులలో ఈ
రాయిని ఉంచి అట్లాగే పట్టుకో మన్నాడు.
కొంత
సేపు పట్టుకున్నాక రాజుకి చేతులు నొప్పి
పుట్ట సాగాయి. కాని సాధువు అట్లాగే పట్టుకో
మన్నాడు. ఇంకొంత సేపు గడిచింది. చేతులు
ఇంకా నొప్పి పుట్ట సాగాయి. కాని సాధువు ఇంకా
అట్లాగే పట్టుకో మన్నాడు. ఇంకొంత సేపు
గడిచింది.
చేతులు విపరీతంగా నొప్పి పుట్ట
సాగాయి. కానీ సాధువు లో ఉలుకు లేదు పలుకు
లేదు. రాజు ఇక చేతుల నొప్పి తట్టుకోలేక రాయిని
జార విడిచాడు.
ఇప్పుడు ఎట్లా ఉన్నది అని సాధువు రాజుని
అడిగితే ఎంతో హాయిగా ఉన్నది అని రాజు జవాబు
ఇచ్చాడు. ఒక్క రాయిని వదిలివేస్తేనే నీకు అంత
హాయిగా ఉన్నప్పుడు నేను ప్రపంచాన్ని అంతటినీ
వదిలి వేశాను కదా ఇంకెంత హాయిగా ఉంటాను అని
సాధువు అడిగేటప్పటికి రాజు అవాక్కు అయ్యాడట.
అప్పుడు అలగ్జాండర్ కి భారత దేశపు ఔన్నత్యం
తలకి ఎక్కింది.