నేడు రమాబాయి అంబేడ్కర్ 124 వ జయంతి సందర్భంగా
కుటుంబంలో భార్య స్థానం ఎంత గొప్పదో రమాబాయి లాంటి వారి జీవితం ఒక ఉదాహరణ. శ్రీమతి రమాబాయి ప్రోత్సాహం బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ అనే వజ్రాన్ని ఈ దేశానికి ఇచ్చారు. కుటుంబ ఆర్థిక అవసరాలు, సంపాదన ఎరిగి జాగ్రత్తగా తన భర్త సంపాన ఖర్చుచేసే ఉత్తమ ఇల్లాలుగా శ్రీమతి రమాబాయి అంబేడ్కర్ జీవితం మనకి తెలియజేస్తుంది. అంబేడ్కర్ లక్ష్యాన్ని తెలుసుకుని కుటుంబ భారం తనమీద వేసుకుని సంతోషంగా పైచదువులకి పంపారు. పిడకలు అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబ అవసరాలు తీర్చి, బాబాసాహెబ్కు కూడా మనీ ఆర్డర్ చేసేవారు. అంబేడ్కర్లాంటి ప్రపంచ మేధావుల్లో ఒకరిని మనకి అందించిన త్యాగశీలి రమాబాయి. భర్త బారిస్టరైనా రమాబాయి జీవితం పూల పాన్పుమాత్రం కాదు.
ఆమె జీవితం త్యాగాల మయం. ఇటువంటి త్యాగజీవిని గురించి త్వరలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రానున్న సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
అంబేడ్కర్ మాటల్లో తన జీవిత భాగస్వామి గురించి తన జీవిత భాగస్వామి రమాబాయి గురించి అంబేడ్కర్ చెప్పినమాటలు.సాత్వికమైన ఆమె మనసు, ఆమెలోని మానసిక సద్భావనతో, పవిత్రమైన సదాచారాలతో దుక్ఖ భరితమైన దినాల్లో కూడా నాకు అండగా నిలబడింది. అప్పుడు మాకెవరూ సహకరించలేదు. పేదరికం, బాధలు నిలువునా మండిస్తున్నా, అత్యంత సహనంతో, బలిదానంతో, త్యాగం, కర్తవ్య పారాయణతో నన్ను నడిపించింది. భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ ఆయన చేసిన ప్రతి కార్యం వెనుక ఆయన భార్య రమాబాయి అంబేడ్కర్ సహకారం ఎంతో ఉంది. ఈ విషయం వీరి జీవితాన్ని గమనిస్తే అర్థమవుతుంది.
రమాబాయి జీవిత విశేషాలు.
రమాబాయి 1897, మే 7న బికువలదకరాకు రెండవ కుమార్తెగా వాలంగ్ గ్రామంలో దపోలో దగ్గర జన్మించారు. వీరిది చాలా పేద కుటుంబం. తండ్రి కూలిపనిచేసేవాడు. బుట్టలో చేపలు పెట్టుకొని సముద్రపు తీరంలో ఓ బారులో అమ్మేవారు. అతని సంపాదన వారి తిండికి కూడా సరిపోయేది కాదు. అన్న కూలి పనిచేసేవారు. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. కొంతకాలానికి తండ్రి కూడా మరణించాడు. తర్వాత బొంబాయిలో ఉండే మేనమామ వీరిని పోషించారు. రమాబాయికి 9ఏళ్ల వయసులో, అప్పటికే పదో తరగతి పూర్తి చేసిన పదిహేను సంవత్సరాల అంబేద్కర్తో పెళ్లి జరిగింది. వారి వివాహం జరిగిన విధానం ఆకాలంలో పేద జీవితానికి అద్ధం పడుతుంది. వారి వివాహం బైకుల్లా చేపల మార్కెట్ (బొంబాయి)లో జరిగింది. మార్కెట్ మూసిన తర్వాత, రాత్రి పూట మార్కెట్లోని ఓపెన్షెడ్లో వీరి వివాహం జరిపించారు.
రమాబాయి చాలా తెలివిగా బాధ్యతగా వ్యవహరించేవారు. కడుపేదరికంలో ఉన్నప్పటికీ, ఎప్పుడూ ప్రశాంత వదనంతో ఉండేవారు. వివాహ సమయంలో ఆమెకు చదువురాదు. అంబేద్కర్ ఆమెకు చదవడం, రాయడం నేర్పించారు. అంబేడ్కరంటే ఆమెకు అమితమైన ప్రేమ. అనురాగంతో కూడిన గౌరవం ఉండేది. నమ్మకం, త్యాగం, అర్థం చేసుకునే గుణం వీరిరువురినీ జీవితాంతం ఆనందంగా ఉండేటట్లు చేసింది. అంబేద్కర్ ఆమెని రాము అని పిలిచేవారు. ఆమె తన భర్తని సాహెబ్ అని పిలిచేవారు. నిరంతర అధ్యయనంతో జ్ఞానసముపార్జనతో నిమగ్నమైన తన భర్తని చూసి ఆమె చాలా గర్వపడేవారు. ఆయన అభివృద్ధి కోసం నిత్యం తపించేవారు. అంబేడ్కర్ ఇంటి కోసం అసలు సమయం కేటాయించేవారు కాదు.
అయినా ఆమె సంసార బాధ్యతల్ని చక్కగా నిర్వహించేవారు. అంబేడ్కర్ పైచదువులకు అమెరికా వెళ్లాలనుకున్నప్పుడు ఇంటి దగ్గర స్త్రీలంతా రమాబాయికి పంపవద్దని చెప్పారు. అక్కడ వేరే స్త్రీని పెళ్లాడితే ఏం చేస్తావు అని ప్రశ్నించారు. ఆమె అలాచేయక అంబేడ్కర్ అమెరికా వెళ్లడానికి సహకరించారు. ఇది ఆమెకు అతనిపై ఉన్న అచంచల విశ్వాసం, ప్రగాఢమైన నమ్మకానికి నిదర్శనం. భర్త బారిస్టరైనా రమాబాయి జీవితం పూల పాన్పుమాత్రం కాదు. ఆమె జీవితం త్యాగాల మయం. అంబేడ్కర్ చదువు, ఉద్యమాలతో బిజీగా ఉండటంతో కుటుంంబ భారమంతా రమాబాయి చూసుకోవాల్సి వచ్చింది. అంబేడ్కర్ తండ్రి, సోదరుడు ఆనందరావు మరణం కుటుంబ జీవితంలో ఆమెకు విషాదాన్ని నింపాయి.
అంబేడ్కర్ ఉన్నత చదువులు చదవాలి అని ఆమెకు ఆశగా ఉండేది. బాబా సాహెబ్ మొదట ఉద్యోగంలో చేరినప్పుడు వచ్చిన మొదటి జీతంతో వారి బంధువులకు కొత్త బట్టలు, స్వీట్స్ పంచిపెట్టారు. అప్పుడు ఆమెకు ఎక్కడలేని సంతోషం కలిగింది. అయితే బాబా సాహెబ్ డా.అంబేడ్కర్ ఆమె సంతోషం మీద నీళ్లు చల్లారు. తనకు వచ్చే జీవితం విందులక ఖర్చు చేయవద్దు. నేను కొన్ని రోజుల్లోనే ఉద్యోగం మాని పై చదువులకు లండన్ వెళ్లాలి అని తన కోరిక చెప్పినప్పుడు ఆమె సహజ స్త్రీ మనస్తత్వం కలిగిన వ్యక్తిగా కాస్త నిరసనపడినా భర్త యొక్క కోరికను, ఆశయాన్ని మన్నించి తనకు సహకరించిన గుణవంతురాలు. బాబాసాహెబ్ జీతం డబ్బులు రూ.1.50పైసలుగా ఒక్క భాగం చేసి రోజు వారి ఖర్చులు చేసి మిగతావి పొదుపు చేసేవారు. దీనితో బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ లండన్ వెళ్లడానికి మానసిక స్థైర్యం ఇచ్చారు రమాబాయి.
అంబేడ్కర్ చదువులు కోసం లండన్ వెళ్లేటప్పుడు తన పూర్తి సహకారం అందించేరు. బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ లండన్ వెళ్లినప్పుడు రమాబాయినే కుటుంబ అవసరాలు తీర్చారు. కుటుంబ జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు జరిగినా ఆమె ఏరోజు చలించిపోలేదు, సమస్యలకు లొంగిపోలేదు. ఇంగ్లాండ్కెళ్లిన కొద్ది రోజులకే అంబేడ్కర్ వద్ద ఉన్న అయిపోయిందది 'ఇక్కడ నా పరిస్థితి ఏమి బాగోలేదు తినడానికి తిండి లేదు. నా దగ్గర కూడా డబ్బు కూడా పూర్తిగా అయిపోయింది. మీకు పంపలేను, నీ దగ్గర ఉన్న నగలు అమ్మివేయి నేను తిరిగివచ్చాక మరల కొనుక్కోవచ్చు అని రమాబాయికి ఉత్తరం పంపారు. ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినా భర్తకు అండగా నిలిచారు రమాబాయి. తర్వాత అంబేడ్కర్ ఎన్నో డిగ్రీలు పొందారు. అవన్నీ రమాబాయి త్యాగనిరతికి ప్రతీకలు. రమాబాయి జీవితం ఎన్నో విషాదాలు చూసింది. వీరికి ఐదుగురు పిల్లలు. కొడుకులు రమేశ్, గంగాధర్, యశ్వంత్, రాజరతన్, కూతురు ఇందు. ఒక్క యశ్వంత్ తప్ప మిగిలిన వారందరూ మరణించారు. పిల్లల మరణం ఆ దంపతుల్ని కుంగతీసింది.
నలుగురు పిల్లలు మరణం, భర్త ఎప్పుడూ ఇంటి పట్టున ఉండకపోవటం, సమాజంలో రాజకీయ ఉద్రిక్తతలు ఆమెను ఆందోళనకు గురిచేశాయి. భర్త ఆరోగ్యం కోసం ప్రార్థించేది. అంబేడ్కర్కి ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆమెకు తెలియనిచ్చేవారు కాదు. ఆమె మరింత ఆందోళన చెందడం అంబేడ్కర్కి ఇష్టముండేది కాదు. ఆమెకు దైవభక్తి ఎక్కువ, ఎప్పుడూ ఉపవాసదీక్షలు చేసేవారు. అంబేడ్కర్ ఎన్నిసార్లు చెప్పినా వినేవారు కాదు. పండరీనాధుడిని దర్శించాలి అనేది ఆమె చిరకాల కోరిక. రమాబాయి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిపోయింది. ఆమె రోజురోజుకి నీరసించిపోసాగింది. ముఖం కళావిహీనంగా మారిపోయింది. అయినా ఆమె ఆలోచనలన్నీ అంబేడ్కర్ మీద ఉండేవి. రమాబాయి అనారోగ్యంతో ఉన్నప్పుడు అంబేడ్కర్ సాన్నిహిత్యం కోరుకునేది.
ఊపిరిసలపని పనులతో అంబేడ్కర్ ఆరోగ్యం క్షీణిస్తున్న దళిత జాతుల కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే ఆమెకు చిరాకు కల్గించేది. అంబేడ్కర్ తనకు దూరం అవుతున్నాడని ఆందోళన చెందేది. ఒక్కొక్కసారి అంబేడ్కర్ని వెంటనే చూడాలని అంబేడ్కర్ సభ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్లేవారు. పరిసరాలు మారితే మానసిక స్థితిలో మార్పు వస్తుంది ఏమో అని అంబేడ్కర్ అప్పుడు పక్క ఊర్లకి పంపేవాడు. పూనా ఒప్పందం మీద తీవ్రమైన చర్చలు జరుగుతున్నా అంబేడ్కర్ గాలి మార్పు కోసం ఆమెను ధార్వార్ తీసుకెళ్లారు. అయినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. దాంతో రమాబాయి అనారోగ్యానికి గురయ్యారు. చివరకు 1935 మే 27న ఆమె తుదిశ్వాస విడిచారు.
పవిత్రమైన నిర్మలమైన మనసు మూగబోయింది. ఆమె మరణించిన తర్వాత అంబేడ్కర్ కన్నీరుమున్నీరుగా విలపించారు. చివరకు సన్యాసం తీసుకోవాలని భావించారు. ఎంతోమంది మిత్రులు నచ్చచెప్పి అంబేడ్కర్ని మామూలు మనిషిగా మార్చారు.
ఈవిధంగా కటికదారిద్య్రంలో జీవితం కొనసాగించిన రమాబాయి ఏ రకమైన ప్రలోభాలనూ తన దరిదాపుల్లోకి రానివ్వలేదు. తన భర్త బారిష్టరైనా ఆమె పిడకలు వేసి సంసారాన్ని నడిపించారు.
ఆమె ఇవన్నీ చూస్తూ కేవలం తన బాధ్యతలను నెరవేరుస్తున్నానని అనుకున్నాను. కాని తనకు తెలియకుండానే ఆత్మగౌరవంతో, మానసిక నిబ్బరంతో జీవించారు. ప్రపంచమేథావి అయిన అంబేడ్కర్ జీవన గమనంలో రహదారిగా మారారు. ఇలాంటి ధన్యజీవి రమాబాయి జీవితం అంబేడ్కర్ ఆదర్శం.
తర్వాత అంబేడ్కర్ కన్నీరుమున్నీరుగా విలపించారు. చివరకు సన్యాసం తీసుకోవాలని భావించారు. ఎంతోమంది మిత్రులు నచ్చచెప్పి అంబేడ్కర్ని మామూలు మనిషిగా మార్చారు.
ఈవిధంగా కటికదారిద్య్రంలో జీవితం కొనసాగించిన రమాబాయి ఏ రకమైన ప్రలోభాలనూ తన దరిదాపుల్లోకి రానివ్వలేదు. తన భర్త బారిష్టరైనా ఆమె పిడకలు వేసి సంసారాన్ని నడిపించారు.
ఆమె ఇవన్నీ చూస్తూ కేవలం తన బాధ్యతలను నెరవేరుస్తున్నానని అనుకున్నాను. కాని తనకు తెలియకుండానే ఆత్మగౌరవంతో, మానసిక నిబ్బరంతో జీవించారు. ప్రపంచమేథావి అయిన అంబేడ్కర్ జీవన గమనంలో రహదారిగా మారారు. ఇలాంటి ధన్యజీవి రమాబాయి జీవితం అంబేడ్కర్ ఆదర్శం.